ఈశాన్య రాష్ట్రం మణిపూర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
(నిట్)లో బీటెక్ చదువుతున్న తెలుగు విద్యార్థులపై గురువారం నుంచి వరుస
దాడులు జరుగుతున్నాయి. హాస్టల్ మెస్లో జరిగిన చిన్న ఉదంతం చినికిచినికి
గాలి వానగా మారి విద్యార్థుల మధ్య ఘర్షణలకు దారితీసింది. స్థానిక
విద్యార్థులు, తెలుగు విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలు సృష్టించింది. గత మూడు
రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 20 మంది
విద్యార్థులు అక్కడి నిట్లో క్షణ క్షణం భయంభయంగా గడుపుతున్నారు.
చికెన్ తెచ్చిన వివాదం...!
మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ఐదేళ్ల క్రితం నిట్ను ప్రారంభించారు. అక్కడి
టక్యాల్పట్, లాంగోల్లో ఉన్న రెండు క్యాంపస్ల్లో పలువురు తెలుగు
విద్యార్థులు ఇంజనీరింగ్లో చేరారు. ఖమ్మం, మహబూబ్నగర్, హైదరాబాద్,
కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, విశాఖపట్నం, వైఎస్సార్ జిల్లాలకు చెందిన
విద్యార్థులు బీటెక్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. కొత్తగా
నిర్మించిన లాంగోల్ క్యాంపస్లో బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థులతోపాటు
ద్వితీయ సంవత్సరం మెకానికల్, సివిల్ బ్రాంచ్లకు చెందిన వారిని తరలించారు.
గురువారం రాత్రి హాస్టల్ మెస్లో స్థానిక సీనియర్ విద్యార్థులు, జూనియర్లైన
తెలుగు విద్యార్థుల మధ్య జరిగిన ఓ ఘటన ఘర్షణకు దారి తీసింది. ఓ సీనియర్
విద్యార్థి క్యూలో నిలుచున్న జూనియర్లను కాదని నేరుగా చికెన్ వడ్డిస్తున్న
చోటుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీన్ని ఓ జూనియర్ తెలుగు విద్యార్థి
అడ్డుకోవడంతో వివాదం రేగింది. దీన్ని మనసులో పెట్టుకున్న సీనియర్
విద్యార్థులు శుక్రవారం సాయంత్రం క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన తెలుగు
విద్యార్థులను రోడ్డుపై అడ్డుకుని స్థానికులతో కలిసి చితకబాదారు. అయితే
తరువాత కొందరు తెలుగు విద్యార్థులు సీనియర్ల వద్దకు వెళ్లి కలసిమెలసి
ఉందామని కోరినా వినకుండా మరోసారి దాడికి దిగి సెల్ఫోన్లను లాక్కున్నారు.
కేంద్ర హోంశాఖకు బీహార్ ఫిర్యాదు
బాధితుల్లో కొందరు బీహార్ విద్యార్థులు ఉండటంతో విషయం అక్కడి మీడియాకు
చేరింది. శనివారం బీహార్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగడంతో అక్కడి
ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్
ఇబోబీసింగ్తోపాటు పోలీసు ఉన్నతాధికారులు శనివారం నిట్ క్యాంపస్ను
సందర్శించారు. తెలుగు విద్యార్థులను కలిసి వారి భద్రతకు భరోసా ఇచ్చారు.
కొందరి సెల్ఫోన్లను తిరిగి ఇప్పించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు నిట్
క్యాంపస్కు సీఆర్పీఎఫ్ బలగాలను తరలించాలని మణిపూర్ ప్రభుత్వం
నిర్ణయించింది. అయితే స్వయంగా సీఎం వచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదని
తెలుగు విద్యార్థులు వాపోతున్నారు. శనివారం అర్థరాత్రి 2 గంటల నుంచి
తెల్లవారుజామున ఐదు గంటల వరకు స్థానికులతోపాటు అక్కడి విద్యార్థులు
క్యాంపస్లోకి చొరబడి బీభత్సం సృష్టించారని చెబుతున్నారు. తలుపులు,
కిటికీలపై రాళ్లు, కర్రలతో దాడులకు దిగటంతో తెల్లవారే వరకు బాత్రూమ్ల్లో
భయంభయంగా గడిపామని తెలిపారు. తక్షణం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు
స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. యాజమాన్యంతో పాటు పోలీసులు
సైతం స్థానిక విద్యార్థులకు వత్తాసు పలికారని ఆరోపిస్తున్నారు.
0 comments:
Post a Comment