Sunday 14 September 2014

ఎన్టీఆర్ స్థానంలో కార్తీ!

యుగానికి ఒక్కడు వంటి అనువాద చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు కార్తీ. ఆ తరువాత ఆయన నటించిన అనువాద చిత్రాలన్నీ తెలుగులో విడుదలై ఇక్కడ అతనికి హీరోగా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ఇప్పటి వరకు అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఆయన త్వరలో తెలుగు చిత్రంలో నటించనున్నారని తెలిసింది. నాగార్జున, ఎన్టీఆర్‌ల కలయికలో వంశీ పైడిపల్లి ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని గత కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు.


తాజా సమాచారం ప్రకారం పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ వి.పొట్లూరి నిర్మించనున్న ఈ సినిమా నుంచి కొన్ని కారణాలవల్ల ఎన్టీఆర్ తప్పుకున్నారని, ఆ స్థానంలో కార్తీని తీసుకున్నారని చిత్ర వర్గాల సమాచారం. గత కొంత కాలంగా తెలుగు సినిమా చేయాలని ఆలోచిస్తున్న కార్తీ దర్శకుడు వంశీ పైడిపల్లి అడిగిన వెంటనే ఈ చిత్రంలో నటించడానికి గ్రీన్‌సిగ్నలిచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం కార్తీ తమిళంలో మద్రాస్, కొంబన్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో మద్రాస్ ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

0 comments:

Post a Comment