Monday 8 September 2014

హీరోలు చేస్తే ఒప్పు... మేం చేస్తే తప్పా?

‘‘హీరోలకో న్యాయం... హీరోయిన్లకో న్యాయమా. వాళ్లు లీనమైతే వృత్తిపట్ల మమకారం.. మేమైతే కావాలని జోక్యం చేసుకున్నట్లా? అని ప్రియాంక చోప్రా ఘాటుగా అంటున్నారు. ఆమె నటించిన ‘మేరీ కోమ్’ చిత్రం ఇటీవల  విడుదలై, మంచి వసూళ్లు రాబడుతోంది. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కండలు తిరిగిన ప్రియాంకను చూసి, అందరూ అభినందిస్తున్నారు. బాలీవుడ్‌లో ప్రియాంక నటనను ప్రశంసించనివాళ్లు లేరు. అయితే.. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలోనూ ప్రియాంక జోక్యం చేసుకున్నారనే వార్త ప్రచారంలో ఉంది.

ఈ వార్తకు ప్రియాంక స్పందిస్తూ -‘‘హీరోలు జోక్యం చేసుకుంటే, ఫర్వాలేదు. కానీ, సినిమా బెటర్‌మెంట్ కోసం హీరోయిన్లు ఏదైనా సలహా ఇస్తే మాత్రం ఎవరికీ నచ్చదు. హీరో చేస్తే.. ఒప్పు... మేం చేస్తే తప్పా? ఏం మాకు తెలివితేటలు ఉండవా? జోక్యం చేసుకునే అర్హత మాకు లేదా? ‘అవును.. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలోనూ నేను జోక్యం చేసుకున్నా. అయితే ఏంటి?’ నా దర్శకుడికి లేని బాధ మీకెందుకు? నా నిర్మాత సంజయ్ లీలా భన్సాలీకి లేని ఆవేదన మీకెందుకు? నేనిచ్చిన సలహాలను ఆ ఇద్దరూ గౌరవించారు’’ అన్నారు ఆవేశంగా.

0 comments:

Post a Comment