Saturday 27 September 2014

ఆ పులికి ప్రాణభిక్ష పెట్టండి...

త్రిషకు నోరులేని జంతువులపై అపారప్రేమ అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా శునకాలంటే త్రిషకు ఎనలేని ప్రేమ. రోడ్డు పక్కన కుక్క కనిపిస్తే చాలు వెంటనే కారు ఆపి దాన్ని తీసుకెళ్లి సంరక్షణ బాధ్యతలు చేపడుతుంది. జంతు సంరక్షణ సంస్థ పెటాకు   స్వచ్ఛంద సేవలందిస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఒక పులి ప్రాణాన్ని కాపాడటానికి తన వంతు ప్రయత్నం చేస్తోంది.మనిషిని చంపిన పులికి ప్రాణభిక్ష పెట్టండి అంటూ నటి త్రిష దేశాధ్యక్షుడు ప్రణబ్‌ముఖర్జీకి విన్నవించుకుంది.

వివరాల్లో కెళితే...ఇటీవల ఢిల్లీలోని జంతుశాలలో సందర్శించడానికి వెళ్లిన వ్యక్తి అదుపు తప్పి తెల్లచారల పులి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఆ పులిని చంపేయాలంటూ దేశాధ్యక్షుడు ప్రణబ్‌ముఖర్జీని కోరుతూ ట్విట్టర్‌లో పోస్టు చేస్తున్నారు. ఆ పులిపై జాలి చూపుతున్నవారు లేకపోలేదు. ఇలాంటి వారితో అందాల భామ త్రిష గొంతు కలిపింది. తెల్లచారల పులిని చంపొద్దంటూ ఈ ముద్దుగుమ్మ ప్రణబ్‌ముఖర్జీకి విన్నవించుకుంటూ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. జంతువులను ప్రేమించాలని హితవు పలికింది. మరి త్రిష ప్రయత్నం ఏమాత్రం ఫలిస్తుందో వేచి చూద్దాం.

0 comments:

Post a Comment